జాతిపిత మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీని హత్య చేసిన గాడ్సేనే నిజమైన దేశ భక్తుడని ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు మరిచిపోకముందే ముంబైలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారిణి గాంధీపై అనుచితంగా ట్వీట్ చేశారు. బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న నిధి చౌదరి మహాత్మాగాంధీ ముఖచిత్రాన్ని భారత కరెన్సీ నోట్లపై నుంచి తొలగించాలని అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలను, పలు సంస్థలు, రోడ్లకు పెట్టిన గాంధీ పేరును మార్పు చేయాలని ట్వీట్ చేశారు. థ్యాంక్యూ గాడ్సేఅంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో గాంధీపై చేసిన ట్వీట్ను ఆమె డిలీట్ చేశారు. తాను పదిహేను రోజుల కిందట చేసిన ట్వీట్పై ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిధి చౌదరి ప్రశ్నించారు.
మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేకు కృతజ్ఞతలు చెప్పిన ఐఏఎస్ అధికారిణి, బృహన్ ముంబై ముసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ నిధి చౌదరి చిక్కుల్లో పడ్డారు. గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ ఆమె చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపడంతో వెంటనే స్పందించిన నిధి ఆ ట్వీట్ను డిలీట్ చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తానేదో వ్యంగ్యంగా ట్వీట్ చేశానని, దానిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
నిధి చౌదరి ట్వీట్పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. గాడ్సేను ప్రశంసించి గాంధీని అవమానించడం బీజేపీ నేతలకు అలవాటైందని, ఇటీవల బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఉషా ఠాకూర్లు ఆ పనిచేశారని, ఇప్పుడు నిధి కలిశారని సూర్జేవాలా మండిపడ్డారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెంటనే అమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీని అవమానించేలా ట్వీట్ చేసిన నిధిని ఉపేక్షించవద్దని, చర్యలు తీసుకోవాల్సిందేనని ఎన్సీపీ డిమాండ్ చేసింది. అయితే వెంటనే నిధి చౌదరిని సస్పెండ్ చేయాలంటూ ఎన్పీపీ డిమాండ్ చేసింది.