ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నా కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిలో మార్పే రాలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు అన్నారు. మొన్న జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నాడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పష్టించిన ఆటంకాలను ప్రజలు అధిగమించారని చెప్పారు. జగన్కు గురువారం మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ఓటమి తప్పదని గ్రహించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు చర్యలు ప్రభుత్వం కొనసాగింపే కానీ ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలను ఓడించాలని ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీకే ఓటు వేశారని తెలిపారు. టీడీపీ మిషన్ 150 సీట్ల విజయానికి పెరిగిన ఓటింగ్ శాతమే నిదర్శనమన్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి కావాలనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల తన జీవితంలో నెరవేరదని లేఖలో పేర్కొన్నారు.