గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ సుభాషణ్ రెడ్డి బుధవారం కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని వైద్య వర్గాలు వెల్లడించాయి. గతంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గాను, లోకాయుక్త చైర్మన్ గానూ పనిచేశారు. సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్ లో ఉన్న ఆయన నివాసానికి తరలించగా, ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఈరోజు సాయంత్రం మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. సుభాషణ్ రెడ్డికి ముగ్గురు కుమారులు. ఇద్దరు న్యాయవాద వృత్తిలో ఉండగా, మరొకరు ఇంజనీరు.