కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే జగన్ ప్రమాణం చేసే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జనంతో నిండిపోయింది. ఇప్పటికే జగన్ తన ఇంటి నుంచి బయలుదేరారు. 12 గంటల 5 నిమిషాలకు జగన్ స్టేడియంకు చేరుకుంటారు. 12 గంటల 23 నిమిషాలకు జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐతే ప్రమాణస్వీకారం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారని ఏపీ ప్రజలు, పార్టీ నాయకులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసలు ఏ ఫైల్పై జగన్ తన మొదటి సంతకం చేస్తారన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అందుకు తగ్గట్టుగానే జగన్ కూడా తన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా జగన్ సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం 20 నిముషాలు పాటు ఉండనుంది.
అయితే ఏపీకి సంబంధించి జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నవరత్నాల్లో కీలక అంశంపై జగన్ తొలిసంతకం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక లోటు కారణంగా ఖర్చులు తగ్గించుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పనున్నట్లు సమాచారం. తన సలహాదారులను నియమించుకోవడంతోపాటు వైసీపీ మేనిఫెస్టోలోని నవరత్నాల అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. నవరాత్నాలతో ఏపీ ప్రజల ముఖాల్లో చిరునవ్పులు తెస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా శాఖలవారీ స్థితిగతులపై శ్వేత పత్రాలు విడుదల చేయడంపైనా జగన్ క్లారీటీ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే జూన్ 1 నుంచి శాఖలవారీగా సమీక్షలు చేయనున్న జగన్ పోలవరంపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు ఇప్పటికే మున్సిపల్ స్టేడియంతో జనంతో కిక్కిరిసిపోయింది. అభిమానులు, వైసీపీ కార్యకర్తలతో అన్ని గ్యాలరీలు నిండిపోయాయి. మరోవైపు సినీ తారలు, పలువురు వీఐపీలు కూడా వేదిక సమీపంలోని గ్యాలరీల వద్ద కూర్చున్నారు. స్టేడియంలో ఎటువైపు చూసినా జనసంద్రంగానే దర్శనమిస్తోంది.