తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణం - కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణమని తేల్చింది టీకాంగ్రెస్. ఎన్నికల అధికారులు, పోలీసులు... అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఘోర పరాజయం ఎదురైందని ఆరోపించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణమని తేల్చింది టీకాంగ్రెస్. ఎన్నికల అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఘోర పరాజయం ఎదురైందని ఆరోపించింది. అయితే ఓటమికి బాధ్యత వహించకుండా, ఈవీఎంలపై నెపాన్ని నెట్టివేయడంపై పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పార్టీ పరాజయానికి ఉత్తమ్, కుంతియా వ్యవహార శైలే కారణమంటోన్న కొందరు లీడర్లు రాహుల్కు కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ పోస్టుమార్టం కొనసాగుతోంది. ఓటమి కారణాలతో ఇప్పటికే అధిష్టానానికి నివేదికిచ్చిన టీపీసీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులను పిలిచి మాట్లాడుతోంది. ముఖ్యంగా అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్ధులతో సమీక్షలు నిర్వహిస్తూ ఓటమికి కారణాలపై ఆరా తీస్తున్నారు. స్వల్ప తేడాతో ఓడిపోయిన చోట ఏమైనా అనుమానాలుంటే న్యాయ పోరాటం చేయాలని సూచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలే కారణమని ఆరోపించిన కుంతియా ట్యాంపరింగ్ అనుమానాలపై హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.
అయితే పార్టీ ఓటమికి ఎవరూ బాధ్యత వహించకుండా ఈవీఎంలపై నెపాన్ని నెట్టివేయడంపై పలువురు నేతలు మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఇన్ఛార్జ్ కుంతియా వల్లే పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆరోపిస్తున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు. 2014లో పార్టీ ఓటమికి పొన్నాలను బాధ్యుల్ని చేసినట్లే ఇప్పుడు ఉత్తమ్, కుంతియా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరూ స్వచ్ఛందంగా పదవుల నుంచి తప్పుకోవాలని, లేదంటే అధిష్టానమే వేటేసేలా రాహుల్కు ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఓటమికి ఈవీఎంలే కారణమన్న వాదనను టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తప్పుబట్టారు. కూటమి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవడంతోనే పరాజయం పాలయ్యామన్నారు. 50రోజుల ముందే ప్రచారం ప్రారంభించాలని తానంటే రెండు వారాలు చాలని కాంగ్రెస్, టీడీపీ నేతలన్నారని, అదే కూటమి కొంపముంచిందని అభిప్రాయపడ్డారు.