ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తన దగ్గరే రాజకీయంగా ఎదిగి, ఇప్పుడు తన ముందే కుప్పిగంతులు వేస్తే చెల్లవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తిరుగుటపాలో ఓటమిని పంపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు. కేసీఆర్ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. జగన్కు వెయ్యి కోట్లు పంపించారు. తిరుగుటపాలో తప్పకుండా ఓటమిని పంపిస్తా. మీకు ఒక్క ఓటు కూడా రాదు. ఒక్క సీటు కూడా రాదు అని బాబు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోసం తమ డేటా దొంగిలించి. తమపైనే కేసులు పెట్టి బెదిరిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీని నిర్వీర్యం చేసేందుకు వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. తొలుత ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా స్కెచ్ వేసిన జగన్ బ్యాచ్ ఆ తర్వాత హైదరాబాద్లో రెండో స్కెచ్ వేసిందని ఆరోపించారు. వైసీపీ మళ్లీ ఓడిపోవడం ఖాయమన్నారు.