ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా కూడా ఇంకా నేతలు పక్క చూపులు చూస్తూనే ఉన్నారు. కాస్తా మొత్తబడ్డాయి అనుకున్న జంపింగ్లు నేడు మళ్లీ ఊపందుకున్నాయి. శనివారం కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్, ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీకి గుడ్బై చెప్పారు. రేపో, మాపో వైసీపీ తీర్థంపుచ్చుకునేందు సిద్ధమవుతున్నారు. తాజాగా అధికార పార్టీ టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్సీవీ నాయుడు పార్టీకి గుడ్బై చెప్పారు. కాగా రేపు (ఆదివారం) నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ఎస్సీవీ నాయుడు ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ కార్యకర్తల సూచల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని ఎస్సీవీ నాయుడు చెప్పారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వల్ల గత ఐదేళ్లుగా అనేక అవమానాలకు గురయ్యానన్నారు. శ్రీకాళహస్తితో పాటు గూడూరులలో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.