ఏపీ సీఎం చంద్రబాబుతో డీఎంకే నేత దొరై మురగన్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన సందర్భంగా కేసీఆర్ - స్టాలిన్ భేటీలో పాల్గొన్న దొరై మురగన్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీకావడం ఆసక్తిగా మారింది.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బేజేపీయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని చెప్పారు. కేసీఆర్ తమిళనాడు పర్యటనని 'ఆధ్యాత్మిక పర్యటన'గా అభివర్ణించారు. తన అపాయింట్మెంట్ని కేసీఆర్ కోరడంతో, మర్యాదపూర్వకంగా కలిసానని చెప్పారు. 'ఇందులో రాజకీయ చర్చలకు పెద్దగా ఆస్కారం లేదన్నారు. కేసీఆర్ చెబుతున్నట్లుగా జాతీయ స్థాయిలో మూడోఫ్రంట్కి అవకాశం అసలే లేదని చెప్పారు స్టాలిన్.
అయితే, చాలా ఆశలు పెట్టుకునే కేసీఆర్, తమిళనాడులో పొలిటికల్ టూర్ని ప్లాన్ చేశారు. నిజానికి గతంలోనూ స్టాలిన్తో కేసీఆర్ మంతనాలు జరిపారు. అప్పట్లో కేసీఆర్ పట్ల కొంత సానుకూలంగా కన్పించిన స్టాలిన్, ఆ తర్వాత మాత్రం రూటు మార్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది డీఎంకే. ఈ నేపథ్యంలో డీఎంకేని, కాంగ్రెస్ నుంచి బయటకు తెచ్చేందుకు బీజేపీ ప్లాన్లో భాగంగా కేసీఆర్, చెన్నయ్కి వెళ్ళి స్టాలిన్తో భేటీ అయ్యారన్న ప్రచారం జోరందుకుంది.
ఇక బీజేపీ మాత్రం డీఎంకే తమతో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరుపుతుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలు సౌందరరాజన్ అన్నారు. ఇది వాస్తవమని, బీజేపీ గెలుపు ఖాయమని ఆమె చెప్పారు.