వేలుపట్టి నడకలు నేర్పించిన నాన్న. తండ్రి కళ్లతో ప్రపంచాన్ని చూసిన కూతురు. పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకురావాలో దిశానిర్దేశం చేసిన డాడీ కాంపిటీటీవ్ వాల్డ్లో తండ్రికే గర్వకారణం నిలిచిన తనయ. ఇప్పుడు ఈ తండ్రీ కూతుళ్ల మధ్యే నేరుగా పోటీ ఉంటే.? బుడిబుడి అడుగులు నేర్పిన నాన్నతో, ఆ కూతురు సమరానికి సిద్దమంటే.? అది అరకులో రాజవంశీయుల మధ్యే మరో కురుపాం యుద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆసక్తి కలిగిస్తోంది తండ్రీ తనయల సమరం.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని కురుపాం రాజ వంశానికిచెందిన వైరిచర్ల కుటుంబం మరోసారి నిరూపిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన తండ్రీ, తనయలు అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ పడనున్నారు. అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కిశోర్చంద్రదేవ్ పోటీ చేయనున్నారు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ ఎన్ లోనూ, అనంతరం కాంగ్రెస్ ఐలోనూ ఆయన ఢిల్లీస్థాయిలో కీలక పాత్ర పోషించారు.
తాజాగా కిశోర్చంద్రదేవ్ టీడీపీలో చేరారు. అయితే బద్దవ్యతిరేక టీడీపీలో చేరడం ఆయన కుమార్తె శృతీదేవికి ఏమాత్రం నచ్చలేదు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని ఆమె పేర్కున్నారు. అరకు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ తరపున పోటీ కి సై అన్నారు. అయితే తండ్రి కోసం శృతీదేవి వెనక్కి తగ్గుతారని భావించినప్పటికీ ఆమె మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు. తాజాగా చంద్రబాబు ప్రకటించిన టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో కిశోర్చంద్రదేవ్కు స్థానం కల్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో శృతీదేవికి అరకు ఎంపీ టికెటును కేటాయించారు.
దీంతో టీడీపీ అభ్యర్థిగా తండ్రి, కాంగ్రెస్ అభ్యర్థిగా కూతురు టికెట్లు దక్కించుకున్నారు. దీంతో కురుపాం రాజకుటుంబంలోని రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. అరుకు నియోజకవర్గంలో తండ్రి కిశోర్ గెలుస్తారా.. లేక ఆయన కుమార్తె శృతీ దేవి గెలుస్తారా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.