ఎన్నికల కౌంటింగ్ రోజు ఒక్క ఫిర్యాదుకు కూడా ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కలెక్టర్లు,ఎస్పీలు అన్ని కేంద్రాలను స్వయంగా పరిశీలించి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు కలెక్టర్లలో సీఎస్ సమీక్షపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
వచ్చే నెల 23న జరిగే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సమీక్షలో ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదితో పాటు డీజీపీ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేసారు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఓట్ల లెక్కింపునకు నెలరోజులు సమయం ఉన్నందున కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. కౌంటింగ్ నిర్వహణలో అలాంటి ఫిర్యాదులకు ఎంతమాత్రం ఆస్కారం ఇవ్వద్దని కలక్టర్లకు స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజు,కౌంటింగ్ తర్వాత అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఈవిషయంలో ఏమాత్రం రాజీపడవద్దని సిఎస్ స్పష్టం చేశారు.
మే మొదటి వారంలో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో శిక్షణా కార్యక్రమాన్నినిర్వహించనున్నట్టు సీఈవో ద్వివేది తెలిపారు.పోటీలో ఉన్న అభ్యర్ధుల నుండి వారి కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను రిటర్నింగ్ అధికారులు సేకరించి వారికి తగిన పొటో గుర్తింపు కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు.కౌంటింగ్ కేంద్రాలల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేనుందున వాటిని తీసుకుని భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిఇఓ ద్వివేది స్పష్టం చేశారు.