వినియోగదారుల హక్కుల రక్షణ విషయంలో రాజీ లేదని ఫోరమ్ కోర్టు స్పష్టం చేసింది. విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్టు శుక్రవారం రెండు ప్రత్యేక కేసుల్లో వినియోగదారులకు న్యాయం చేస్తూ తెలుగులో తీర్పును ప్రకటించింది.
బెజవాడలోని వినియోగదారుల ఫోరమ్ కోర్ట్ రెండు సంచలన తీర్పులను వెలువరించింది. మొదట సేవల్లో లోపం మోసానికి పాల్పడ్డారంటూ కలర్స్ హెల్త్కేర్ లిమెటెడ్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంభ, రాశి వంటి సినీతారలతో ప్రసారమాధ్యమాల్లో వస్తున్న ప్రకటనలను చూసిన ఓ మహిళ అందులో ట్రీట్మెంట్ తీసుకుంది. చికిత్స కోసం 74 వేల 652 రూపాయలను ఖర్చు చేసింది. అయితే ఆమె అనారోగ్యానికి గురవడమే కాకుండా శరీరం వికృతరూపానికి మారిందని.. వినియోగదారుల ఫోరమ్కు కంప్లైంట్ చేసింది.
దీనిపై విచారించిన ఫోరమ్ కలర్స్ సంస్థ 2 లక్షల రూపాయలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలంటూ జస్టిస్ మాధవరావు ఆదేశించారు. సెలబ్రిటీస్తో ప్రసారమవుతున్న ప్రకటనలను వెంటనే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. 9 శాతం వడ్డీతో వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని తిరిగివ్వాలని స్పష్టం చేసింది.
అలాగే మరో కేసులో మాల్స్, మల్టిప్లెక్స్లో పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్న పీవీఆర్ మాల్ పై కూడా కొరఢా ఝులిపించింది. వాహనాలను ఉచితంగా పార్కింగ్ చేసుకోవాల్సిన పీవీఆర్ మాల్ డబ్బులు వసూలుచేయడంతో వినియోగదారుడి ఫిర్యాదు మేరకు 5 లక్షల రూపాయలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది. ప్రకటనలపట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఫోరమ్ కోర్ట్ స్పష్టం చేసింది.