ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

Update: 2019-05-28 08:10 GMT

ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. శక్తి అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడి ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలంలో టీడీపీ జెండా ఎగురవేసిన చంద్రబాబు నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడని ఎన్టీఆర్‌ను కొనియాడారు. సంక్షేమ పథకాల సృష్టికర్త ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని చెప్పారు చంద్రబాబు. ఎన్నికల్లో 40శాతం ఓట్లు టీడీపీకి వచ్చాయని, వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనివ్వాలని అన్నారు. టీడీపీకి ఓటు వేసిన 40 శాతం ఓటర్లకు సేవ చేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి, బాధ్యతగా ప్రతిపక్షంగా ఉంటామని చెప్పారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు చంద్రబాబు. రేపటి నుంచి గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు చంద్రబాబు. 

Full View

Similar News