కొలిక్కి వచ్చిన జమ్మలమడుగు జగడం
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ పంచాయితీ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు సూచించిన రాజీ ఫార్ములాకు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అంగీకరించారు.
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ పంచాయితీ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు సూచించిన రాజీ ఫార్ములాకు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అంగీకరించారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశాన్ని ఇద్దరు నేతలు చంద్రబాబుకు వదిలేశారు,
జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం విషయంలో నెలకొన్న వివాదంపై కడప జిల్లా నేతలు సీఎం చంద్రబాబుతో మరోసారి సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన భేటీకి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎంపీ సీఎం రమేష్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ తమకే కేటాయించాలంటూ ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరూ గట్టిగా పట్టు పడ్డారు. దీంతో చంద్రబాబు రాజీ ఫార్ములా సూచించారు.
కడప లోక్సభ నుంచి ఒకరు జమ్మలమడుగు అసెంబ్లీ సీటు నుంచి మరొకరు పోటీ చేయాలని ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డికి చంద్రబాబు సూచించారు. అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశాన్ని ఇద్దరు నేతలు సీఎంకే వదిలేశారు. వారం రోజుల్లో చంద్రబాబు తన నిర్ణయాన్ని చెబుతానని అన్నారని ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డి ఉమ్మడిగా పక్రటించారు. ఎవరికి ఏ స్థానం కేటాయించినా కలిసి పనిచేస్తామని చెప్పారు.
ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి జమ్మలమడుగు అసెంబ్లీ సీటు విషయంలో వివాదానికి తెరపడడంతో కడప జిల్లా టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.