ఇంటర్ బోర్డు అవకతవకలపై విపక్షాలన్నీ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, టీపీసీసీ సెక్రటరీ నగేష్ల మధ్య కుర్చీల పంచాయితీ జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా తోపులాట జరిగింది. కుర్చీల కోసం జరిగిన ఘర్షణలో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో నగేష్ కింద పడిపోయారు. అనంతరం నగేష్ కూడా లాగడంతో వీహెచ్ కూడా కింద పడిపోయారు. వారిద్దరికీ అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.. కానీ వాళ్లు వినలేదు. అక్కడే ఉన్న కోదండరాం, చాడ వెంకటరెడ్డి సర్ధిచెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది. చనిపోయిన ఇంటర్ పిల్లల కుటుంబాలు ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే మీరు గాంధీభవన్లో కొట్లాడుకోండంటూ అఖిలపక్ష నేతలు కాంగ్రెస్ లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.