తెలంగాణలో పలువురు సినీ ప్రముఖులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్తో పాటు పలువురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్లో నిల్చొని వారు ఓటు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓటు హక్కున్న చిరంజీవి, తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనలతో కలిసి వచ్చి ఓటేశారు. తమవంతు కోసం సుమారు 20 నిమిషాల పాటు వేచి చూసిన చిరంజీవి కుటుంబ సభ్యులు, ఆపై పోలింగ్ బూత్ లోనికి వెళ్లి ఓటు వేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు అల్లు అర్జున్ ఓటేశారు. అల్లు అర్జున్ వచ్చేసరికే చాలా మంది క్యూ లైన్ లో ఉండటంతో చాలాసేపు వేచిచూడాల్సి వచ్చింది. నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఇదే పోలింగ్ బూత్ లో ఓటేశారు. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో తల్లితో పాటు, సతీమణి లక్ష్మీ ప్రణతితో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య సమంత అక్కినేని ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉన్న పోలింగ్ కేంద్రంలో వీరిద్దరూ ఓటు వేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మంచు మనోజ్ తన సోదరి మంచు లక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ డే అంటే హాలీడే లా భావించకూడదని హీరో మంచు మనోజ్ అన్నారు. సినీ తారలు ఓటు వేసేందుకు రావడంతో వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.