బాబుకు కేంద్రం ఝలక్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దావోస్ పర్యటనను ఏడు రోజులకు బదులుగా నాలుగు రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దావోస్ పర్యటనను ఏడు రోజులకు బదులుగా నాలుగు రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది. ముఖ్యమంత్రి వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా నలుగురికే అనుమతి ఇచ్చింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ నెల 20న బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వాల ప్రతినిధులతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు. ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్కి వెళ్లడం ఆనవాయితీ.
ఈసారి కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఆయనతోపాటు, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ సహా 14 మంది సభ్యుల బృందం వెళ్లాలన్నది ఆలోచన. ఈ మేరకు రాజకీయ అనుమతుల కోసం కేంద్ర విదేశాంగ శాఖకు దరఖాస్తు చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించింది. దీంతో ఏపీ సీఎం తన పర్యటనను 4 రోజులకే పరిమితం చేసుకోవలసి వచ్చింది.