దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిజామాబాద్ ఎన్నిక నిర్వాహణపై ఈసీ మల్లగుల్లాలు పడుతోంది. 185 మంది అభ్యర్ధులు బరిలో ఉండటంతో ఎన్నిక నిర్వాహణపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఓ వైపు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్కు ఏర్పాట్లు చేస్తూనే భారీ ఈవీఎంల తయారిపై అధికారులు దృష్టి సారించారు. గతంలో బెల్ తయారు చేసిన ఎం3 ఈవీఎంను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే అభ్యర్ధులకు గుర్తులు కేటాయించిన ఈసీ ముందు జాగ్రత్త చర్యగా బ్యాలెట్ ముద్రణకు అనుమతినిచ్చింది. బుక్లెట్ తరహాలో బ్యాలెట్ పేపర్ భారీగా ఉండటంతో బ్యాలెట్ బాక్సులను భారీ డ్రమ్ముల తరహాలో రూపొందిస్తున్నారు. తాజా పరిణామాలతో పాటు ఎం3 ఈవీఎంను పరిశీలించిన ఈసీ పూర్తి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. సీఈసీ నిర్ణయం ఆధారంగా ఎన్నికల నిర్వాహణకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.