వివాహేతర సంబంధం అనుమానంతో పాకిస్థానీ వ్యక్తి హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని అంతమొందించాడు.. ఈ కేసులో పాకిస్తాన్, యూకే పౌరసత్వం కలిగిన పెర్విజ్ (27)కు లండన్లోని క్రౌన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంతేకాదు ఒకవేళ పెరోల్ కావాలనుకుంటే అతను కనీసం 22 సంవత్సరాల శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు మరో 18 నెలల శిక్ష కూడా విధించింది. 'మీ భార్య, కుటుంబ సభ్యులు, మరణించిన మొహమ్మద్లు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదు' అని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఈ ఏడాది మే లో అందరూ చూస్తుండగానే పెర్విజ్ హైదరాబాద్కు చెందిన తన సహోద్యోగి నదీమ్ ఉద్దీన్ హమీద్ మొహమ్మద్ (24)ను కత్తితో దాడి చేశాడు. దాంతో తీవ్ర గాయాలతో అతను మృతిచెందాడు. మొహమ్మద్ చనిపోయే నాటికి అతడి భార్య అఫ్సా ఎనిమిది నెలల గర్భంతో ఉంది. పెర్విజ్ పై మొహమ్మద్ భార్య ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పలు కోణాల్లో విచారించిన లండన్ కోర్టు నిందితునికి కఠిన శిక్ష అమలు చేసింది.