కొలంబియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాదంలో తరైరా, డోరిస్ గ్రామాల మేయర్, ఆమె కుటుంబ సభ్యులు, విమాన యజమాని, పైలట్, కో– పైలట్ సహా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతిచెందినట్టు కొలంబియా పౌర విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. విమాన ప్రమాద ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డుక్యూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
ప్రమాదానికి ఇంజిన్ లో లోపమే కారణమని కొందరు విమాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం ప్రమాదానికి గల కారణాలు వెల్లడించలేదు. మరోవైపు ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని గుర్తించారు. ప్రమాదానికి గురైన విమానాన్ని నిర్వహిస్తున్న లాజార్ ఏరియో కంపెనీ ఈ ఘటనపై స్పందించలేదు.