స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ తన కుమారుడి ఫోన్ పగలగొట్టి, దూర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తార్నాక విజయపురికాలనీకి జబర్దస్త్ యాంకర్ అనసూయ రావడంతో ఫొటో తీస్తుండగా ఫోన్ లాక్కుని పగలగొట్టిందని ఫిర్యాదుచేసిన మహిళ అనసూయపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.
యాంకర్ అనసూయ ఏదో పని నిమిత్తం తార్నాక విజయపురికాలనీకి వచ్చింది. తన తల్లితో కలిసి అటుగా వెళ్తోన్న బాలుడు రోడ్డుపక్కన అనసూయ కనిపించగానే అభిమానంతో ఆమెతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే తీవ్ర కోపోద్రిక్తురాలైన అనసూయ పిల్లాడి చేతిలో నుంచి సెల్ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టింది. దాంతో తల్లీకొడుకు బిత్తరపోయారు. తేరుకున్న బాలుడి తల్లి తన కొడుకు ఫోన్ ఎందుకు పగలగొట్టావంటూ ప్రశ్నించింది. అయితే దూర్భాషలాడిన అనసూయ కారులో అక్కడ్నుంచి వెళ్లిపోయింది. దాంతో బాలుడి తల్లి అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.