టాలీవుడ్లో ట్వీట్ల సెగను మరోసారి రాజేశారు జనసేనాని. శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వివాదంలో తనను లాగడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించిన పవన్ .. దీనికి సంబంధించి పలు ట్వీట్లు చేశారు. ఇది అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదని పక్కా ప్లాన్ ద్వారా ముందే రచించిన స్క్రిప్ట్ ప్రకారం జరిగిన వ్యవహారమంటూ ట్వీట్ చేశారు. మొత్తం ఎపిసోడ్లో కనబడుతున్న పాత్రధారుల కంటే వెనకున్న బడాబాబులే కీలకపాత్ర పోషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా పరిణామాలను తెలియజేస్తూ జనసేనాని మరోసారి ట్వీట్ల ద్వారా ప్రశ్నలు సంధించారు. నిజమైన అజ్ఞాతవాసి ఎవరో తెలుసా అంటూ తొలి ట్వీట్ చేసిన ఆయన కాసేపటికే.. నిజాలు నిగ్గు తేల్చేందుకు లైవ్ ఇవ్వబోతున్నానంటూ ట్వీట్ చేశారు ?
నిన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను కార్నర్ చేస్తూ ట్వీట్లతో చెలరేగిన పవన్ ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. చేయూతనిచ్చిన చేతిని వెనకమూలగా చంపేసేందుకు ప్రయత్నిస్తున్న మిమ్మల్నీ ఎలా నమ్మాలంటూ సీఎం చంద్రబాబునును సూటిగాప్రశ్నించారు. మీరు నాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా అంటూ ట్వీట్ల ద్వారా చంద్రబాబును ప్రశ్నించారు. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ఈ ప్రయత్నం మీకు తెలియకుండా జరుగుతోంది అంటే ఎలా నమ్మమంటారని చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు.
సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు టాలీవుడ్ ప్రముఖులు సమావేశం ఏర్పాటు చేసిన సమయంలోనే పవన్ వరుస ట్వీట్లు హాట్ హాట్గా మారాయి. ఇదే సమయంలో కాసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వరుస ట్వీట్ల నేపధ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.