తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కామరాజర్ సిఫార్సుతోనే శ్రీదేవి బాలనటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ విషయం ఆమె తండ్రి అయ్యప్పన్ సన్నిహిత మిత్రులకు మాత్రమే తెలుసు. వారిలో ఒకరైన 81 ఏళ్ల బాలు నాయకర్ శ్రీదేవి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శ్రీదేవి స్వగ్రామంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, ఆయన స్నేహితుడు బాలు నాయక్కర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఓరోజు నాలుగేళ్ల శ్రీదేవిని ఆమె తండ్రి కామరాజర్ వద్దకు తీసుకెళ్లారు. కామరాజర్.. ఈ బాలిక సినిమాల్లో నటిస్తే బాగుంటుందని చెప్పారు. తమిళ సినీ గేయ రచయిత కన్నదాసన్కు కబురు చేసి సిఫారసు చేయమన్నారు. ఆయన శ్రీదేవిని నిర్మాత చిన్నప్పదేవర్కు పరిచయం చేశారు. తాను తీస్తున్న ‘తునైవన్’ చిత్రంలో బాల కుమారస్వామి (మురుగన్) పాత్రలో నటించేందుకు తగిన బాలిక కోసం అన్వేషిస్తున్న ఆయన.. శ్రీదేవిని చూడగానే ఎంపిక చేశారు.