భారత క్రికెటర్ శిఖర్ధావన్కు దుబాయ్ ఎయిర్పోర్టులో అవమానం జరిగింది. సతీమణి ఆయేషాతో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి ధావన్ బుధవారం దక్షిణాఫ్రికా బయల్దేరాడు. ముంబయి నుంచి దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో వీరు దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంది. దుబాయ్లో దక్షిణాఫ్రికా విమానం ఎక్కే సమయంలో సంబంధిత విమాన సిబ్బంది ధావన్ భార్యతో పాటు పిల్లలను ఎక్కించుకునేందుకు అనుమతించలేదట. ఈ విషయంపై ధావన్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.
‘నాతో దక్షిణాఫ్రికా వస్తున్న నా ఫ్యామిలీని అడ్డుకోవడం ఎమిరేట్స్కు అనైతిక చర్య. నా భార్య, పిల్లలకు దుబాయ్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే విమానానికి బోర్డింగ్ ఇవ్వలేదు. మా పిల్లల జనన ధృవీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు. ఆ సమయంలో అవి అందుబాటులో లేవు. వాటికోసం వారు దుబాయ్ ఎయిర్పోర్టులో నిరీక్షిస్తున్నారు. ముంబై విమానాశ్రయంలోనే ఈ పత్రాలను అడిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఎలాంటి కారణం లేకుండా ఓ ఎమిరేట్స్ ఉద్యోగి తన కుటుంబ పట్ల దురుసుగా ప్రవర్తించాడని’ అసహనం వ్యక్తం చేశాడు.