కింగ్ ఖాన్కు ఐటీ శాఖ షాక్..నేరం రుజువైతే 6 నెలల నుంచి ఏడేళ్ల దాకా జైలు శిక్ష
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్కు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాకిచ్చింది. కింగ్ ఖాన్కు చెందిన అత్యంత ఖరీదైన ఫామ్ హౌస్ను అటాచ్ చేసింది. బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద జప్తు చేసింది. వ్యవసాయం కోసం తీసుకున్న భూమిలో ఫామ్ హౌస్ నిర్మించాడని ఆరోపణలు రావడంతో షారుక్కు డిసెంబర్లో ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే షారుక్ నుంచి స్పందన రాకపోవడంతో ఎటాచ్ నిర్ణయం తీసుకున్నారు.
ఐటీ అటాచ్ చేసిన ఫామ్ హౌస్ మహారాష్ట్ర ఆలీబాగ్లో బీచ్ ఒడ్డున ఉంది. వ్యవసాయం చేసేందుకు భూమి కొనుగోలు చేసి ఆ స్థలంలో విలాసవంతమైన ఫామ్హౌస్ నిర్మించారని షారుక్పై ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర చట్టం ప్రకారం వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నియమాలేవీ పాటించకపోవడంతో బినామీ లావాదేవీల చట్టం ప్రకారం ఐటీ శాఖ షారుక్కు గత డిసెంబర్లో నోటీసులు జారీచేసింది. షారుక్ నుంచి స్పందన రాకపోవడంతో జనవరి 24న మరోసారి ఇ-మెయిల్ ద్వారా రిమైండ్ లెటర్ పంపించింది. అయినా ఇప్పడు కొరడా ఝళిపించింది.
కొన్నేళ్ల కిందట షారుఖ్ సుమారు 20 వేల గజాల భూమిని వ్యవసాయం కోసం ఆలీబాగ్ కొన్నాడు. అయితే దానిని అందుకోసం ఉపయోగించకుండా.. ఫామ్ హౌస్ నిర్మించాడు. ఈ బంగ్లాలో స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ హెలీప్యాడ్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం అటాచ్ చేసిన ఆస్తివిలువ మార్కెట్ రేటు దాదాపు 15 కోట్లు ఉంటే...అసలు ధర.. సుమారు 100 కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా. కింగ్ ఖాన్ నేరం రుజువైతే ఆరు నెలలనుంచి ఏడేళ్ల దాకా శిక్ష, ఆస్తిలో 10 శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.