పవన్ అభిమానులకు రేణు దేశాయ్ వార్నింగ్....నేను నోరు తెరిస్తే మీ పొగరు గంగపాలే
పవన్ కల్యాణ్ అభిమానులపై రేణు దేశాయ్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు తాను మౌనంగా ఉన్నానని, అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలని, మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. విడాకుల వ్యవహారంపై తాను కనుక నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని హెచ్చరించారు. విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన పవన్ అభిమానులకు గర్వభంగం అవుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
గురువారం ఆమె ఇన్స్టాగ్రాంలో తనను ట్రోల్ చేస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన ఇన్స్టాగ్రాం ఖాతాలోకి ప్రవేశించి ఏడుపు గొట్టు కథలు చెప్పే అధికారం పవన్ కల్యాణ్ అభిమానులకు లేదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ అభిమానుల నెగటివిటీని తానెందుకు భరించాలని ప్రశ్నించారు. వాళ్ల నెగటివిటినీ భరించాల్సినంత తప్పు తానేం చేశానని అడిగారు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అపరిపక్వత ఎలా అవుతుందని నిలదీశారు. ఇకనైనా తన ఇన్స్టాగ్రాంలోకి వచ్చి సలహాలు ఇవ్వడం ఆపేయాలని కోరారు. ‘‘అభిమానుల అవధుల్లేని మూర్ఖత్వానికి తెరపడి నేను స్వేచ్ఛగా సోషల్ మీడియాను తెరిచి నా గురించి, నా పని గురించి కామెంట్లు చదువుకొనే రోజు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చెప్పారు.