టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాల జోరు మెల్లమెల్లగా పెరుగుతోంది. త్వరలో నాగార్జున, నానిల కాంబినేషన్లో ఒక చిత్రం పట్టాలెక్కబోతున్న విషయం తెల్సిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మెగా, నందమూరి మల్టీస్టారర్ ప్రారంభం కానుంది. ఇలా వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇతర హీరోలు కూడా మల్టీస్టారర్ చిత్రాలపై ఆసక్తిని కనబర్చుతున్నారు. తాజాగా రవితేజ కూడా తాను మల్టీస్టారర్ చిత్రాలకు పూర్తిగా సహకరిస్తాను అని, మంచి కథలతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్ చేస్తాను అంటూ తేల్చి చెప్పాడు. తాజాగా రవితేజ ‘టచ్ చేసి చూడు’ చిత్రాన్ని చేశాడు. ఆ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమంలో భాగంగా రవితేజ మాట్లాడుతూ మల్టీస్టారర్ మూవీపై క్లారిటీ ఇచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి తీయబోయే మెగా మల్టీస్టారర్లో ఇంకో హీరోకు కూడా చోటుందని.. ఒక సీనియర్ హీరో ఇందులో విలన్ పాత్ర చేస్తాడని కొన్ని రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు.. మాస్ రాజా రవితేజానే అంటూ కూడా గుసగుసలు వినిపించాయి. రాజమౌళికి రవితేజకు మంచి స్నేహం ఉన్న నేపథ్యంలో ఇది నిజమే అయ్యుంటుందని కూడా అనుకున్నారు. ఐతే ఆ ఊహాగానాలపై మాస్ రాజా నీళ్లు చల్లేశాడు. ‘టచ్ చేసి చూడు’ ప్రమోషన్లలో భాగంగా ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేసిన మాస్ రాజా.. రాజమౌళి సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారటగా అని అడిగితే.. ఏదేదో ఊహించుకోవద్దు అంటూ సెలవిచ్చాడు. కానీ దాంతో పాటుగా ‘‘ఈ ఐడియా బాగుంది’’ అంటూ కామెంట్ చేయడం విశేషం.
రవితేజ మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీలో ఉన్న వారు అంతా కూడా స్నేహితులే అని, మంచి కథతో వస్తే ఏ హీరోతో నటించేందుకు అయినా సిద్దంగా ఉన్నాను అని, పాత్ర మంచిగా ఉండి తనకు నచ్చితే నిడివి తక్కువ ఉన్నా పర్వాలేదు అని, ఏ హీరోతో అయినా స్క్రీన్ను షేర్ చేసుకుందానికి అయినా సిద్దంగా ఉన్నాను అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రవితేజ ఇచ్చిన ఆఫర్ను ఏ దర్శకుడు అయినా యూజ్ చేసుకుంటాడా అనేది చూడాలి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేలటికెట్’, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.