సమ్మర్ రేస్లో దమ్ము చూపేందుకు విడుదలైన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి జతకట్టిన రామ్ చరణ్.. ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపాడని మెగాఫ్యాన్స్నుండి వినిపిస్తున్నమాట. అత్యంత భారీ అంచనాలతో సుమారు 1700 థియేటర్స్లో శుక్రవారం నాడు భారీగా విడుదలైంది ‘రంగస్థలం’. పల్లెటూరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని టాక్ రావడం, రాంచరణ్, సమంతతోపాటు ప్రధాన తారాగణం యాక్టింగ్ బాగుండటం ఈ సినిమాకు కలిసివచ్చినట్టు కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘రంగస్థలం’ అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ దుమ్మురేపుతోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘రంగస్థలం’ అప్పుడే వన్ మిలియన్ మార్క్ను అధిగమించింది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు వసూళ్లు బాగుండటంతో ఈ సినిమా ఈ మార్క్ను అధిగమించింది. సినిమా టాక్ బాగుండటంతో వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా దూసుకుపోవచ్చునని భావిస్తున్నారు.