పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్న క్రమంలో ఆమెపై పవన్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో రేణు తన ట్విటర్ అకౌంట్ను డీఆక్టివేట్ చేసుకుంది. దీనిపై ఆమె వివరణ కూడా ఇచ్చింది. "ట్విట్టర్లో విపరీతమైన నెగిటివిటీ నిండి ఉందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ ఉండే వాళ్లు అధికంగా అజ్ఞాత వ్యక్తులు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చిరాకుతో ఉన్న వాళ్లు. సినిమా వాళ్ల గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కాని తప్పుగా రాయడానికే ఇష్టపడతారు. నేను ఓ నూతన జీవితంలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. ట్విటర్ నుంచి వైదొలిగి ఆ నెగిటివిటీకి దూరంగా ఉండదలచుకున్నాను. అదే సమయంలో నన్ను అర్థం చేసుకుని, నా మంచి కోరుతూ ప్రతికూల పరిస్థితుల్లో నాకు తోడుగా నా వెంట ఉన్న ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆమె తన ట్విటర్ అకౌంట్ను క్లోజ్ చేశారు.
రెండో పెళ్లి చేసుకోబోతున్న రేణుకు పవన్ స్వయంగా శుభాకాంక్షులు తెలిపినా అతని అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ‘మీ వల్ల మా దేవుడికి ఎలాంటి సమస్య రాకూడదు. ఏం? పెళ్లి చేసుకోలేకపోతే బతకలేవా వదినా.. లోకంలో ఎంతమంది పెళ్లిచేసుకోకుండా ఒంటరి జీవితం గడపడం లేదు? నువ్వు ఆదర్శంగా ఉండాలి.. నువ్వు పెళ్లాడితే పవన్ కల్యాణ్ అభిమానులుగామేం జీర్ణించుకోలేం.. నువ్వు రెండో పెళ్లి అంటూ పవన్ గారిని ఇబ్బంది పెడుతున్నావు.. ‘ అంటూ రకరకాల కామెంట్లతో అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఈ వరుస కామెంట్లపై ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి స్పందించింది. ‘రేణూ దేశాయ్, పవన్ కల్యాణ్ అధికారికంగా విడాకులు పొందారు. రేణూకి ఎవరినైనా పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉంది. పవన్ కల్యాణ్ చాలా సెన్సిబుల్ మనిషి. స్వేచ్ఛకు విలువ ఇచ్చే వ్యక్తి. ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా అభిమానులు తప్పుడు చేష్టలకు పాల్పడవద్దు’ అని అన్నారు.