నిర్మాణ సంస్థ: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
తారాగణం: గోపీచంద్, మెహ్రీన్ కౌర్, శ్రీనివాసరెడ్డి, పృథ్వి, సంపత్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
మాటలు: రమేశ్ రెడ్డి, శ్రీకాంత్
కూర్పు: ప్రవీణ్ పూడి
కళ : ఎ.ఎస్.ప్రకాశ్
నిర్మాత: కె.కె.రాధామోహన్
దర్శకత్వం: కె.చక్రవర్తి
మాస్ హీరో గోపీచంద్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో ఒక్క హిట్టు కూడా లేక డీలా పడ్డాడు. కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లడంతో ఆయన నటిస్తోన్న సినిమాలు ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నాయి. గతేడాది 'ఆక్సిజన్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా వర్కవుట్ కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే 'పంతం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈసారైనా గోపీచంద్ అనుకున్న విజయాన్ని సాధించాడా..? లేదా..? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ; ఆనంద్ సురానా (ముఖేష్ రుషి) లండన్లో ఉండే భారతీయ వ్యాపారవేత్త. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. మినిస్టర్లకు కూడా సురానాను కలవాలంటే నెలల సమయం పడుతుంది. అలాంటి సురానా ఫ్యామిలీ వారసుడు విక్రాంత్ సురానా (గోపిచంద్). ఆనంద్ సురానాకు దానధర్మాలు చేయటం ఇష్టం ఉండదు. తన భార్య దుర్గాదేవి (పవిత్రా లోకేష్) అలా దాన ధర్మాల కోసం డబ్బు ఖర్చు చేస్తుందని ఇండియా నుంచి వ్యాపారాలను ఫ్యామిలినీ లండన్ తీసుకెళ్లిపోతాడు. కానీ విక్రాంత్ మాత్రం తల్లి బాటలోనే నడుస్తాడు. తల్లి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కోసం తిరిగి ఇండియా వస్తాడు. అలా ఇండియాకు వచ్చిన విక్రాంత్కు ఎదురైన పరిస్థితులేంటి..? ఆ పరిస్థితులపై విక్రాంత్ ఎలా పోరాటం చేశాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు ; మాస్ యాక్షన్ రోల్లో తనకు తిరుగులేదని గోపిచంద్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పర్ఫాక్ట్గా సూట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్లో మంచి ఈజ్ చూపించాడు. ఫస్ట్ హాప్లో కామెడీ టైమింగ్తోనూ అలరించాడు. ముఖ్యంగా కోర్ట్ సీన్లో గోపిచంద్ నటన సూనర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్ మెహరీన్ పాత్ర కేవలం పాటలకే పరిమితమైంది. ఉన్నతలో మెహరీన్ తన వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. విలన్గా సంపత్ రాజ్ రొటీన్ పాత్రలో కనిపించారు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా తనదైన స్టైల్లో మెప్పించారు. ఇతర పాత్రల్లో జయప్రకాష్, పృథ్వీ, షియాజీ షిండే, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ ; ఉన్నవాడి దగ్గర దోచుకుని లేనివాడికి పెట్టడం అనే రాబిన్హుడ్ తరహా కథ ఇది. ఎప్పుడూ కొత్త తరహా కథలను ఎంచుకునే గోపీచంద్ తన 25వ సినిమా కోసం ‘కిక్’, ‘శివాజీ’ వంటి రొటీన్ కథను ఎంచుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాను ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లర్గా మలిచే అవకాశం ఉంది. దొంగతనాలు చేసే విధానం, పోలీసుల నుంచి తప్పించుకునే సందర్భాలు, విలన్లను బురిడీ కొట్టించడాలు..ఇలాంటి సన్నివేశాల్లో తెలివితేటలు చూపించగలిగితే బాగుండేది. కానీ కథానాయకుడు డబ్బులు ఎత్తుకుపోవడం లాంటి సన్నివేశాలను కూడా చాలా రొటీన్ పద్ధతిలోనే తెరకెక్కించాడు. కథానాయిక పాత్రకి, ఆమెతో నడిచే ప్రేమ కథకి ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోవడంతో వారి మధ్య నడిచే సన్నివేశాలు కూడా విసుగు తెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థంలో దర్శకుడు కాస్త కోలుకున్నాడు. విక్రాంత్ ఫ్లాష్బ్యాక్, తాను దొంగగా మారడానికి దారితీసిన పరిస్థితులు, అతని లక్ష్యం ఇవన్నీ సమంజసంగానే అనిపిస్తాయి. కోర్టు సన్నివేశాలు, పలికే సంభాషణలు ఆలోచనలో పడేస్తాయి. అవినీతి, లంచగొండితనం, ప్రభుత్వ పథకాలు అందవలసిన వారికి సరిగ్గా అందకపోవడం వంటి పాయింట్లపై గోపీచంద్ పలికిన సుదీర్ఘమైన సంభాషణలు రచయితగా దర్శకుడిలో ఉన్న ప్రతిభను చూపిస్తాయి. పతాక సన్నివేశాల్లో రొటీన్గా యాక్షన్ జోలికి పోకుండా డైలాగులతో సరిపెట్టేశారు. కాకపోతే కథ, కథనం ఏమాత్రం లాజిక్కు అందకపోవడం నిరాశపరుస్తుంది. పాత సినిమాల ఛాయలు పడకుండా దర్శకుడు కొత్తగా ప్రయత్నిస్తే బాగుండేది.