మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ముచ్చటగా మూడో సారి పెళ్లికొడుకయ్యారు. మత బోధనలు చేసే బుష్రా మనేకాను లాహోర్ లోని ఆమె సోదరుడి నివాసంలో కొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నారు. 1995లో బ్రిటిష్కు చెందిన బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్స్మిత్ను వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్లు వీళ్లు కలిసి ఉన్నారు. జెమీమాకు ఇద్దరు కుమారులు. తర్వాత 2015లో టీవీ యాంకర్ రెహామ్ ఖాన్ను వివాహం చేసుకున్నారు. వీరు కేవలం పది నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు.
గత జనవరి 1న ఇమ్రాన్ ఖాన్, బుష్రా మనేకాను వివాహం చేసుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి. వాటిని ఆయన ఖండించారు. తాను ఆథ్యాత్మిక సలహాలు తీసుకునేందుకు మాత్రమే ఆమె వద్దకు వెళ్తున్నానని ఇమ్రాన్ ఖాన్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ పుకార్లు ఆగకపోవడంతో వాటి ప్రభావం పార్టీపై పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను వివాహం చేసుకుంటానని ఆయన గత నెల ప్రకటించారు. మనేకా వయసు 40కి పైగా ఉంటుంది. ఆమెకు మొదటి భర్తతో అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మతబోధకురాలు. ఖాన్ గత ఏడాది కాలంగా ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు కోసం ఆమె వద్దకు వెళ్తున్నారు. ఖాన్ విషయంలో రాజకీయపరంగా ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయట. గత నెలలోనే మనేకా తన భర్తకు విడాకులు ఇచ్చింది. తర్వాత తాను బుష్రాను పెళ్లి చేసుకుంటానని అడిగానని గత నెలలోనే ఇమ్రాన్ వెల్లడించిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే పుకార్లు షికార్లు చేశాయి. ఎట్టకేలకు వారి వివాహం జరిగింది.