గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏకంగా 178 నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారాన్ని గణనీయంగా తగ్గించింది. గౌహతిలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జరిగింది. 28 శాతం జీఎస్టీ శ్లాబున కేవలం యాభై వస్తువులకే పరిమితం చేశారు.
28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న వినియోగదారుల వస్తువుల్లో 178 వస్తువులకు రిలీఫ్ లభించింది. 28 శాతం శ్లాబు నుంచి ఆయా వస్తువులను తప్పించడంతో పాలిష్, డిటర్జెంట్, పోషకాహార పానీయాలు, కాస్మొటిక్స్, చాక్లెట్లు, చూయింగ్గమ్లు, షాంపూల, డియోడరెంట్లు రేట్లు ఇక నుంచి దిగిరానున్నాయి.
ఇప్పటి వరకు 28 శాతం జీఎస్టీ శ్లాబులో 227 వస్తువులు ఉండేవని, ఇప్పుడు ఆ శ్లాబును కేవలం సిమెంట్, విలాస వస్తువులు, వాషింగ్ మెషీన్లు,పెయింట్స్, ఎయిర్ కండీషనర్లు వంటి 50 వస్తువులకు మాత్రమే పరిమితం చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు బీహార్ ఆర్థికమంత్రి సుశిల్ మోదీ తెలిపారు. ఫిట్మెంట్ కమిటీ సిఫార్సుల మేరకు చాలా వస్తువులు 18 శ్లాబులోకి, 12 శాతం శ్లాబులోకి రానున్నట్లు చెప్పారు.
రెస్టారెంట్లలో వెరైటీ ఫుడ్ ఇష్టపడేవారికి తాజా జీఎస్టీ కౌన్సిల్ భేటీ తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు రెస్టారెంట్లపై ఉన్న 18 శాతం జీఎస్టీని కేవలం అయిదు శాతమే వసూలు చేయనున్నారు.