లేడీ సూపర్ స్టార్ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్ శివన్ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు. నాన్మ్ రౌడీ ధాన్(తెలుగులో నేనూ రౌడీనే)చిత్ర షూటింగ్ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపిస్తూ హాట్ టాపిక్గా మిగిలారు. ఒకానోక దశలో వీరిద్దరూ కేరళలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు రావటం.. వాటిని నయనతార ఖండించటం చూశాం. ఆ సమయంలో విఘ్నేశ్తో ఉంది కేవలం స్నేహం మాత్రమే అంటూ ఆమె ప్రకటించారు. అయినప్పటికీ వారి మధ్య రిలేషన్షిప్ గురించి తర్వాత చాలా కథనాలు వచ్చాయి.
కాగా తన ప్రేమ గురించి నయన్ తొలిసారి ఓ వేదికపై మాట్లాడారు. విఘ్నేశ్ తనకు కాబోయే భర్తని చెప్పకనే చెప్పారు. చెన్నైలో ఓ మీడియా సంస్థ అవార్డుల వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నయన్ హాజరయ్యారు. ‘ఎక్సలెన్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్’ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆమె వేదికపై ప్రసంగిస్తూ.. ‘నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా తల్లి, తండ్రి, సోదరుడికి, నాకు కాబోయే భర్త(విఘ్నేశ్ను ప్రస్తావిస్తూ)కు ధన్యవాదాలు. ఇప్పటి వరకు నేను పాల్గొన్న అవార్డుల కార్యక్రమానికి, ఈ కార్యక్రమానికి చాలా తేడా ఉంది. ఇక్కడ నా చుట్టూ ఉన్న మహిళలు సాధించిన విజయం నాలో మరింత స్ఫూర్తిని నింపింది’ అని చెప్పి ప్రేమపై ఓ స్పష్టత ఇచ్చారు.