బిగ్బాస్ ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. ఇంట్లో పెళ్లి టాస్క్ మొదలు కావడంతో ఇంటి ఆవరణ అంతా పెళ్లి తోరణాలతో, అలంకరణలతో పచ్చగా కనిపించింది. ఇంటి సభ్యులు రెండు కుటుంబాలుగా మారారు. గీతా మాధురి, అమిత్ రాధా, కృష్ణ కుటుంబంగా, మాధవీలత కుటుంబంగా కౌశల్, దీప్తి నల్లమోతు జట్టుగా విడిపోయారు. మంగళవారం జరిగిన పెళ్లి వేడుకకు అనసూయ అతిథిగా హాజరయింది. రాధాకృష్ణ, మధులత గ్రూప్ లు వధూవరుల తరపున ప్రాతినిధ్యం వహించగా మంగళవారం మెహందీ కార్యరక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాట్ యాంకర్ అనసూయ హాజరుకావడం మరింత ‘షో’ చేకూరింది. పురోహితుడుగా గణేష్ వ్యవహరించారు. టాస్క్లో భాగంగా పలు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తొలుత బిగ్బాస్ అబ్బాయి తరపున వాళ్లకు టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్లో ఉంగరాలు వెతికితీయాలన్నారు. సామ్రాట్, దీప్తిలు ఈ టాస్క్ పూర్తి చేశారు. ఇక అమ్మాయి తరపు వాళ్ళకి హౌస్లో దాచి ఉంచిన చెప్పుల జతలను వెతికి పట్టుకోవాలని చెప్పారు. ఇందు కోసం అమిత్, గీతా మాధురి, తనీష్, గణేష్, పూజాలు కష్టపడి 20 జతల చెప్పులను పట్టుకున్నారు. బహుమతులు గెలుచుకునేందుకు బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు లడ్డూలను చుట్టాలని, పెళ్లి కుమారుడి కుటంబ సభ్యులు దుపట్టాలను అలంకరించడం లాంటి సరదా టాస్క్లను ఇచ్చారు. దీంతో ఆయా గ్రూపుల టాస్క్తో బిజీగా ఉంటూనే తమ నామినేషన్ గురించీ చర్చించుకున్నారు.
ఇంట్లో ఓపక్క ఇలా హంగామా నడుస్తుండగా బిగ్హౌస్లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ పాట వినిపించడంతో సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అదే సమయంలో అనసూయ తాంబూలంతో ఎంట్రీ ఇచ్చింది. హౌస్లో అందరినీ పేరుపేరునా పలకరించింది. బిగ్బాస్కి మరింత శోభ చేకూర్చేందుకు వచ్చినట్లు చెప్పింది. వధూవరుల్లో ఎవరి తరపున ఉంటారని సభ్యులు ప్రశ్నించగా తనకు ఇద్దరూ కొడుకులే కావున వధువు తరపునే ఉంటానని చెప్పి నవ్వులు పూయించింది. బుధవారం జరగనున్న సంగీత్, పెళ్లి వేడుకల్లో రంగమ్మత్త ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి.