పాకిస్తాన్ దొంగాట మరోసారి బయటపడింది. మన దేశంపై కక్ష కట్టిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్ విడుదలకు పరోక్షంగా సహకరించింది. పాక్ ప్రభుత్వం సరైన సాక్ష్యాలు సమర్పించలేకపోవడంతో హఫీజ్కు స్వేచ్ఛ లభించబోతోంది. ముంబై దాడులు చేసి 9 ఏళ్ళవుతున్న సందర్భంగా ఈ డేంజరస్ ఉగ్రవాదికి పాక్ సర్కారు ఈ నజరానా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
ముంబై ఉగ్రదాడుల సూత్రధారి ఉగ్రవాదసంస్థ జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్కు స్వేచ్ఛ లభించబోతోంది. గృహనిర్బంధం నుంచి అతడిని రిలీజ్ చేస్తూ లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది. లాహోర్ హైకోర్టు జ్యుడిషియల్ బోర్డు గత నెలలో హఫీజ్పై గృహ నిర్బంధాన్ని 30 రోజుల పాటు పొడిగించింది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో మరో 3 నెలలు నిర్బంధాన్ని పొడిగించాల్సిందిగా పాక్ ప్రభుత్వం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా హఫీజ్ సయీద్ను గృహనిర్బంధంలో ఉంచేందుకు అంగీకరించబోమన్న న్యాయస్థానం ప్రభుత్వం సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయిందని తేల్చిచెప్పింది. వెంటనే హాఫీజ్ సయీద్ను విడుదల చేయాలని ఆదేశించింది.
యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద జనవరి 31న హఫీజ్ సయీద్తో పాటు అతని నలుగురు అనుచరులను పాక్ ప్రభుత్వం నిర్బంధించింది. ప్రజా భద్రత చట్టం ప్రకారం రెండుసార్లు ఈ నిర్బంధాన్ని పొడిగించారు. హఫీజ్ అనుచరులకు అక్టోబరులోనే నిర్బంధం నుంచి విముక్తి కలిగించినా హఫీజ్ను మాత్రం నిర్బంధంలోనే ఉంచారు. సాక్ష్యాలు సేకరించడంలో పాక్ ప్రభుత్వం అసమర్ధత కారణంగా ప్రపంచ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మళ్లీ బయటకు రాబోతున్నాడు. సయీద్ను అమెరికా ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలకు 10 మిలియన్ల రివార్డును వెలకట్టింది. ఇలాంటి ఉగ్రవాద నేతను గృహనిర్బంధం నుంచి రిలీజ్ చేయడంపై భారత్తో పాటు పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.