సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసుకు నచ్చింది’ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా పి. కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మించారు. ఈ చిత్రం ఆడియోను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. ‘‘ఓ ఇంటర్వ్యూలో పవన్ కోసం కథ రాసుకున్నానని, దాని టైటిల్ ‘పవన్’ అని అన్నారు’’ అని ఓ విలేకరి మంజులను ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘అవును చెప్పాను. కథ కూడా ఉంది. నిజంగా చెబుతున్నా.. మా నాన్న , నా సోదరుడి తర్వాత నేను మెచ్చే వ్యక్తి ఆయన (పవన్). మనసు ఏది చెబుతుందో అదే చేస్తారు, నిజాయతీ కలిగిన వ్యక్తి. ఆయన కోసం కథ ఉంది. ఇక ఆయన సినిమాలు చేయరని నాకు తెలుసు. కానీ, నేను రాసుకున్న కథ ఆయన విన్నారంటే కచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఈ కథను ఆయన కాదనలేరు. కచ్చితంగా నచ్చుతుంది. ఈ ఒక సినిమా చేసి ఆయన రాజకీయాల్లోకి వెళ్లొచ్చు. కథ వినమని ఆయనకు చెప్పండి (విలేకరులను ఉద్దేశించి నవ్వుతూ)’ అని అన్నారు.