తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు క్రిష్. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో మణికర్ణిక అనే చిత్రంతో తీరిక లేకుండా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే క్రిష్ తన సతీమణి నుండి విడాకులకి దరఖాస్తు చేసినట్టు ఓ వెబ్ సైట్ ప్రచురించడం ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రీకరణ సమయంలో షూటింగ్కి బ్రేక్ ఇచ్చి ఆగస్ట్ 7న రమ్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు క్రిష్. వీరి వివాహానికి టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా డిఫరెన్సెస్ వచ్చాయని.. దీంతో వారిద్దరూ విడిపోవాలని భావించినట్టు వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల నిర్ణయం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అయితే వీరిద్దరు ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ డీసెంట్ మ్యానర్లో విడిపోవాలని భావిస్తున్నట్టు సమాచారం.