బాలయ్య అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. జై సింహా రూపంలో బాలయ్య అభిమానులకు పండుగ పలకరించింది. జైసింహా సినిమా సూపర్ అంటున్నారు....అభిమానులు. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చిందని సంబర పడుతున్నారు. జైసింహా హిట్ అంటున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జై సింహా’.. సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. బాలయ్య- నయనతార కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ‘జై సింహా’కు చిరంతన్ భట్ అందించిన సంగీతం ఇప్పటికే అభిమానులను అలరించింది. ఈ సినిమాలో హరి ప్రియ, నటాషా దోషి కూడా హీరోయిన్లుగా నటించారు.
‘జై సింహా’ సినిమాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ రివ్యూ ఇచ్చాడు. ‘‘80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగూరగంప సినిమా "జై సింహ". నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!’’ అంటూ కత్తి మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.