ఎట్టకేలకు పద్మావత్ చిత్రం విడుదలైంది. అయినప్పటికీ కర్ణి సేన ఆందోళనలు మాత్రం తగ్గటం లేదు. దీనికి తోడు చిత్ర యూనిట్ సభ్యులకు తాజాగా మళ్లీ బెదిరింపులు ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తల్లి ‘లీలా భన్సాలీ’పై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు కర్ణిసేన ప్రకటించింది. ఆ సినిమాకు ‘లీలా కీ లీలా’ అనే టైటిల్ పెట్టబోతున్నామని మీడియా ద్వారా వెల్లడించారు.
చిత్తోర్గఢ్ ప్రాంగణంలో కర్ణిసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ సింగ్ మీడియాతో సమావేశమయ్యారు. మరో 15 రోజుల్లో సంజయ్ తల్లిపై సినిమా మొదలవుతుందని.. అరవింద్ వ్యాస్ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తాడని తెలిపారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం రాజస్థాన్లోనే జరుగుతుందని పేర్కొన్నారు. ‘భన్సాలీ మా అమ్మ ‘పద్మావతి’ని అవమానించారు. ఇప్పుడు మేము ఆయన తల్లి జీవితాధారంగా సినిమా తీయబోతున్నాం. కానీ భన్సాలీ మా అమ్మను అవమానించినట్లు మేము ఆయన తల్లిని అవమానించేలా సినిమా తీయబోము’ అని తెలిపారు.