టైటిల్ : జువ్వ
జానర్ : కమర్షియల్ ఎంటర్టైనర్
తారాగణం : రంజిత్, పాలక్ లల్వాని, అర్జున్, పోసాని కృష్ణమురళీ, మురళీశర్మ
సంగీతం : ఎమ్.ఎమ్. కీరవాణి
దర్శకత్వం : త్రికోటి.పి
నిర్మాత : డా. భరత్ సోమి
రాజమౌళి దగ్గర అసిస్టెంటుగా పని చేసి దర్శకుడిగా మారిన త్రికోటి తాజాగా 'జువ్వ' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించడం, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ప్రమోట్ చేయడం, ట్రైలర్ కూడా బావుండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఏమేరకు అందుకుంది? గతంలో 'దిక్కులు చూడకు రామయ్య' లాంటి వినూత్న సినిమా తీసి ప్రశంసలు అందుకున్న త్రికోటి కమర్షియల్ సక్సెస్ అందుకోలేక పోయారు. మరి పూర్తి కమర్షియల్ ఫార్ములాతో రూపొందిన 'జువ్వ'తో త్రికోటి తన గోల్ రీచ్ అయ్యాడా?
కథ : 14 ఏళ్ల వయసులో బసవరాజు పాటిల్ (మలయాళ నటుడు అర్జున్) తన క్లాస్మేట్ శృతి(పాలక్ లల్వాణి)ని ప్రేమిస్తున్నాని వేధిస్తాడు. తప్పని మందలించిన స్కూల్ ప్రిన్సిపల్ను చంపేస్తాడు. ఈ కేసులో బసవరాజుకు 14 ఏళ్ల శిక్ష పడుతుంది. జైలుకు వెళ్లేప్పుడు కూడా శృతితో నీ కోసం తిరిగొస్తా అనటంతో శృతి కుటుంబం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేస్తుంది. తన పేరును కూడా ఆధ్యగా మార్చుకొని ప్రశాంతంగా ఉంటుంది. రానా జనాలను మోసం చేస్తూ డబ్బులు సంపాందించే అల్లరి కుర్రాడు. ఆధ్యను చూసిన రానా తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెకు దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అదే సమయంలో 14 ఏళ్ల తరువాత జైలు నుంచి విడుదలైన బసవరాజు శృతి కోసం వెతుకుతున్నాడని తెలిసి ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. రానా... బసవరాజు నుంచి శృతిని ఎలా కాపాడాడు..? ఈ ప్రయత్నంలో రానాకు ఎవరెవరు సాయం చేశారు..? చివరకు బసవరాజు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే: ప్రమాదంలో ఉన్న ఓ అమ్మాయి కోసం ఆమెను ప్రేమించిన ఓ అబ్బాయి చేసిన పోరాటమే ఈ చిత్రం. ఇదివరకు చూసిన కథే ఇది. కథనంలో కూడా కొత్తదనం ఏమీ లేదు. ప్రథమార్థం నాయకానాయికల పాత్రల నేపథ్యం, కాసిన్ని వినోదాత్మక సన్నివేశాలతో సాగిపోతుంది. ద్వితీయార్థం కథ హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి మారుతుంది. జైలు నుంచి వచ్చిన బసవరాజ్.. శ్రుతి జాడ కోసం చేసే ప్రయత్నాలు...అతని నుంచి శ్రుతిని తప్పించేందుకు రాణా చేసే ప్రయత్నం..రాణా, శ్రుతిలు ఎక్కడికి వెళితే అక్కడ శత్రువులు తయారవడం వంటి సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. అయితే కథ చాలా చిన్నది కావడంతో దాన్నే అటూ ఇటూ తిప్పుతూ సాగదీయడం ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తుంది. ప్రథమార్థంలో రంజిత్, సప్తగిరి, భద్రం నేపథ్యంలో కొన్ని హాస్య సన్నివేశాలు.. ద్వితీయార్ధంలో పోసాని కృష్ణమురళి, కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పంచిపెడతాయి. పతాక సన్నివేశాల్లో కూడా కొత్తదనం ఏమీ లేదు. భావోద్వేగాలు పండకపోవడం సినిమాకు ప్రధాన లోపం.
ఎవరెలా చేశారంటే: రంజిత్, పలక్ లాల్వానీ జంట చూడ్డానికి బాగుంది. రంజిత్ డ్యాన్సుల్లో, డైలాగుల్లో పర్వాలేదనిపించాడు. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, అర్జున, అలీ, సప్తగిరి, భద్రం తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కీరవాణి సంగీతం, సురేశ్ కెమెరా పనితనం సినిమాకు ప్రధానబలం. దర్శకుడు త్రికోటి కథకుడిగా మరోసారి ఆకట్టుకున్నారు. అయితే కథ పరిధి సరిపోలేదు. రత్నం రాసిన కథలో కొత్తదనం అస్సలు కన్పించదు. నిర్మాణ పరంగా సినిమా ఉన్నతంగా ఉంది.
బలాలు:
+ సంగీతం
+ ఛాయాగ్రహణం
+ నిర్మాణ విలువలు
బలహీనతలు:
-కథలో కొత్తదనం కొరవడటం
-ద్వితీయార్థం సాగదీత