సినిమా పేరు: జంబలకిడి పంబ
తారాగణం: శ్రీనివాస్రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్, ధన్రాజ్, షకలక శంకర్, హరి తేజ, రాజ్యలక్ష్మి, హిమజ, కేదారి శంకర్, మధుమణి, మిర్చి కిరణ్, జబర్దస్త్ అప్పారావు, సన, సంతోష్, గుండు సుదర్శన్, జబర్దస్త్ ఫణి తదితరులు.
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: సతీశ్ ముత్యాల
కళ: రాజీవ్ నాయర్
నిర్మాణం: రవి, జోజో జోస్, శ్రీనివాస్రెడ్డి.ఎన్
రచన, దర్శకత్వం: జె.బి. మురళీకృష్ణ (మను)
సంస్థ: శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్
విడుదల: 22 జూన్ 2019
దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ రూపొందించిన జంబలకిడి పంబ చిత్రం అలనాడు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. తాజాగా అదే సినిమా పేరుతో శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా అదే టైటిల్ తో మరో సినిమా తెర మీదకు వచ్చింది. కమెడియన్గా కొనసాగుతూనే హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి హీరోగా తెరకెక్కిన ఈ మోడ్రన్ జంబ లకిడి పంబ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? గతంలో క్లాసిక్ సినిమాలను టచ్ చేసిన చాలా మంది ఫెయిల్ అయ్యారు. మరి ఆ ట్రాక్ రికార్డ్ను ఈ సినిమా బ్రేక్ చేసిందా..?
కథేంటంటే: సాఫ్ట్వేర్ ఇంజినీర్ వరుణ్, ఫ్యాషన్ డిజైనర్ పల్లవి(శ్రీనివాస్, సిద్ధి ఇద్నానీ) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలోపే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. దాంతో విడిపోవాలనుకుంటారు. ఇలాంటి జంటలకు విడాకులు ఇప్పించడమే పనిగా పెట్టుకున్న న్యాయవాది హరిశ్చంద్ర ప్రసాద్(పోసాని కృష్ణమురళి)ని సంప్రదిస్తారు. వరుణ్, పల్లవిలను విడగొడితే వంద జంటలకు విడాకులు ఇప్పించిన న్యాయవాదిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతానని సంబరపడుతుంటాడు హరిశ్చంద్ర ప్రసాద్. ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ తన భార్యతో కలిసి గోవా టూర్కి వెళ్తారు. మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో ఇద్దరూ చనిపోతారు. పైకి వెళ్లాక దేవుడు హరిశ్చంద్రను రానివ్వడు. ఇదేంటని హరిశ్చంద్ర దేవుడిని అడిగితే.. ‘నువ్వు విడగొట్టాలనుకున్న వందో జంటను కలిపితేనే నీ భార్య వద్దకు నిన్ను పంపుతాను’ అని చెప్తాడు. అప్పుడు ఆత్మ రూపంలో కిందకి దిగివచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్.. వరుణ్, పల్లవిలను కలపడానికి ఎన్ని పాట్లు పడ్డాడు? ఎంతకీ కలిసి ఉండటానికి ఇష్టపడని వరుణ్, పల్లవి దంపతులపై జంబ లకిడి పంబ మంత్రం వేశాక ఏం జరిగింది? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.
నటీనటులు : కమెడియన్గా మంచి ఇమేజ్ ఉన్న శ్రీనివాస్ రెడ్డి హీరోగానూ తన ఇమేజ్కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు. జంబ లకిడి పంబ సినిమాలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. కొన్ని సీన్స్ లో లవర్ భాయ్లా కనిపించే ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కామెడీ పరంగా మాత్రం తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్గా పరిచయం అయిన సిద్ధి ఇద్నాని మంచి నటన కనబరించారు. చాలా సీన్స్ లో శ్రీనివాస్ రెడ్డిని డామినేట్ చేశారు. ముఖ్యంగా వరుణ్ ఆత్మ తనలోకి వచ్చిన తరువాత వచ్చే సీన్స్ లో చాలా ఈజ్తో నటించి ఆకట్టుకున్నారు. సినిమాలో మరో కీలక పాత్రలో పోసాని కృష్ణమురళి. తనకు అలవాటైన పాత్రలో పోసాని మరోసారి మంచి నటన కనబరిచారు. ఇతర నటీనటులకు పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు దక్కలేదు.
విశ్లేషణ: చీటికీ మాటికీ గొడవలు పడే దంపతులు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్న మాట నిజమే. అలాగే కొంతమంది స్వార్థపరులైన న్యాయవాదులు దీన్నే అవకాశంగా భావించి డబ్బు సంపాదించడానికే మొగ్గుచూపుతుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా లాక్కొస్తుంటారు. ఇంతా జరగకుండా ఉండాలంటే.. ఒక్క క్షణం ఎదుటివారి స్థానంలో నిలుచుని ఆలోచిస్తే అంతా అదే సర్దుకుంటుంది అని చెప్పే సినిమా ఇది. అయితే లైన్గా వినడానికి బావుంది కానీ, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. పాటలు కూడా మెప్పించవు. ఒకరి మీద ఒకరు పగ పట్టడం, ఒకరి కెరీర్లను మరొకరు నాశనం చేసుకోవాలనుకోవడం వంటి సన్నివేశాలన్నీ తేలిపోయాయి. ఎక్కడా డెప్త్ కనిపించదు. ఇద్దరిలోనూ ఉన్న కసి కనిపించదు. అమ్మాయి లక్షణాలతో శ్రీనివాసరెడ్డి, అబ్బాయి లక్షణాలతో సిద్ధి బాగా నటించారు. సత్యం రాజేశ్ ప్రవర్తించే విధానం సహజంగా ఉంటుంది. హరితేజ పాత్ర బావుంది. వెన్నెల కిశోర్ తన పరిధిలో బాగా నటించారు. చాలా సందర్భాల్లో కామెడీ నవ్వించలేకపోయింది. పాటలు ఎప్పుడొస్తాయో, ఎందుకొస్తాయో అన్నట్టు ఉన్నాయి. అమ్మాయిల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు సున్నితంగా, హద్దుమీరకుండా తెరకెక్కించిన విధానం బావుంది.