సూపర్ స్టార్ కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల గురించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ను కలిసేందుకు వారింటికి వెళ్లేవాణ్ని. అప్పటినుంచీ వైఎస్ జగన్తో నాకు సత్సంబం ధాలున్నాయని వెల్లడించారు. ప్రజలకు ఏదో చేయాలి, వారి కష్టాలను తీర్చాలన్న పట్టుదల ఉన్న వ్యక్తి జగన్ అని కృష్ణ అభిప్రాయపడ్డారు.
‘‘ఇచ్చిన మాటకు కట్టుబడిన, చేసిన వాగ్దానాలు అమలు చేసిన నాయకున్ని ఒక్క వైఎస్ను మాత్రమే చూశాను. ఆయన మాట మీద నిలబడిన తీరు, ప్రజలకు చేసిన సేవ ఎనలేనివి’’ అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని సినీ హీరో కృష్ణ కొనియాడారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ కూడా ఎంపీయేనని కృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి చివరిదాకా మంచి మిత్రులుగా కొనసాగామని తెలిపారు. వైఎస్ను చరిత్రాత్మక పాదయాత్ర సందర్భంగా జనం ఎంతగా రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు వైఎస్ జగన్ను కూడా పాదయాత్ర పొడవునా అదే మాదిరిగా ఆశీర్వదిస్తున్నారని అన్నారు.
వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రతి ఒక్కటీ జనాలకు ఎంతగా ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసు. ఒక్క పథకమని కాదు.. వైఎస్ తీసుకొచ్చిన అన్ని పథకాలూ నాకు ఇష్టమైనవే. అందుకే నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే అని అన్నారు. ఎండాకాలం. పైగా మే నెల. ఎంత ఇబ్బందో అందరికీ తెలుసు. అయినా జగన్ ప్రజల్లోనే ఉంటూ - వారికోసం అంతగా కష్టపడటం గొప్ప విషయం. 2019లో వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారని కృష్ణ స్పష్టం చేశారు.