పాక్ ప్రధాని ఇమ్రాన్ నోరు పారేసుకున్నారు. ముందు చూపు లేని తక్కువ స్థాయి వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటూ మోడీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. పాక్తో చర్చలకు భారత్ నో చెప్పినందుకు ఇమ్రాన్ విషం చిమ్మారు. పాకిస్థాన్ తో చర్చలకు భారత్ వెనక్కి తగ్గడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందన్నారు. తన ప్రతిపాదనపై వెనక్కితగ్గడంతో భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. భవిష్యత్తు గురించి ముందు చూపులేని చిన్న స్థాయి వ్యక్తులను తన జీవితంలో ఎంతో మందిని చూశానంటూ పరోక్షంగా భారత ప్రధాని మోడీని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
భారత్తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దమంటూ ఈ నెల 14న మోడీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ లేఖ రాశారు. చర్చలను మళ్లీ కొనసాగించాలని లేఖలో కోరారు. ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనపై తొలుత సానుకూలంగా స్పందించిన భారతప్రభుత్వం న్యూయార్క్ లో ఇరుదేశాలు భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యేందుకు అంగీకారం తెలిపింది. ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో భారత్ వెనక్కి తగ్గింది. కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో పాక్తో చర్చలెలా జరుపుతామంటూ భారత ప్రభుత్వం తెగేసి చెప్పింది. చర్చలను ఆపివేస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ 2016 పఠాన్కోట వైమానిక స్థావరంపై పాక్ భారీ దాడికి పాల్పడడంతో భారత ప్రభుత్వం ద్వైపాక్షిక చర్చలను నిలిపివేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు.