ఎలాంటి ష్యూరిటీ లేకుండానే పేటీఎం రూ.20వేల అప్పు!!

Update: 2017-12-13 09:38 GMT

పర్సులో డబ్బు లేదన్న సంగతి ఎలా తెలుస్తుందో కానీ...సరిగ్గా ఆ సమయానికే ఖర్చులన్నీ కట్టకట్టుకుని వచ్చిపడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవర్ని అడగాలి? అయినా, ఎవరి దగ్గర మాత్రం వేలకువేల డబ్బు మూలుగుతూ ఉంటుంది? ఓమూలన మూలుగుతున్నా, ఇచ్చే మనసంటూ ఉండాలిగా! అడిగి లేదనిపించుకోవడం కంటే, అడక్కుండా మన దారి మనం వెతుక్కోవడమే ఉత్తమం.

గత్యంతరం లేదు. బ్యాంకు గడప తొక్కాల్సిందే. సవాలక్ష పత్రాలు, సవాలక్ష క్వశ్చన్స్ వీటన్నింటిని దాటుకొని ఆ డబ్బు చేతికొచ్చే సరికి పుణ్యకాలం పుర్తవుతుంది. మన అవసరం తీరిపోతుంది. అయితే అలాంటి బాధలు పడే అవసరం లేకుండా జీరో ఇంట్రస్ట్ తో మనకు అవసరం అనుకున్నప్పుడు రూ20వేలు ఇచ్చేందుకు పేటీఎం సిద్ధమైంది. ఈ సేవల్ని తన కష్టమర్లకు అందించేందుకు పేటీఎం ఐసీఐసీఐ బ్యాంక్ తో చేతులు కలిపింది.

 పేటీఎం యాప్ లో ఒక్కసారి లాగిన్ అయితే చాలు ఎలాంటి షూరిటీ లేకుండా ఆ డబ్బు చేతికొస్తుంది. మరి మనం తీసుకున్న  20వేల అప్పుపై 40 రోజుల వరకు వడ్డీ ఉండదు. గడువులోగా తిరిగి చెల్లించకపోతే రూ.50 జరిమానాతో పాటు 3శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందట. ఈ రూ.20వేల అప్పు చెల్లించిన తర్వాత మళ్లీ కావాలంటే వెంటనే మళ్ళి తీసుకోవచ్చు. కాబట్టి ఆపదసమయాల్లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం ఉత్తమమని ఔత్సాహికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆఫర్ వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే ఉందని దీన్ని త్వరలో వ్యాపార సంస్థలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అనూప్ తెలిపారు. 

Similar News