నిర్మాణ సంస్థ: లక్ష్మి ప్రసన్న పిక్చర్స్
తారాగణం: మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియా శరన్, నిఖిలా విమల్, అనసూయ, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.తమన్
ఛాయాగ్రహణం: సర్వేశ్ మురారి
కళ: చిన్నా
కూర్పు: ఎం.ఎల్.వర్మ,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
నిర్మాత: డా. మోహన్ బాబు యమ్.
దర్శకత్వం: మదన్ రామిగాని
డైలాగ్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్లో మంచు విష్ణు, శ్రియ జోడీగా నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించాడు.. డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించారు. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్లో మోహన్బాబు నిర్మిస్తోన్న 42వ చిత్రం ‘గాయత్రి’ కావడం విశేషం. ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలను తెరకెక్కించిన మదన్ తొలిసారిగా తన స్టైల్ మార్చి థ్రిల్లర్ జానర్ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ ప్రయత్నం మదన్కు మరో విజయాన్ని అందించిందా..? నటుడిగా మోహన్ బాబు మరోసారి తన మార్క్ చూపించాడా..?
కథ: శివాజీ (వయసులో ఉన్నప్పుడు విష్ణు, వయసు మళ్లిన తర్వాత మోహన్బాబు) స్టేజీ ఆర్టిస్ట్. అతని నటనను చూసి ఇష్టపడుతుంది శారద. వారిద్దరికీ శారద తండ్రి ఘనంగా పెళ్లి చేస్తాడు. శారద తండ్రి అతి మంచితనం వల్ల ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుంటాడు. అతను కన్నుమూయడంతో ఉన్న ఇల్లును కూడా జప్తు చేస్తారు. శారద తన భర్తతో పాటు కొత్త ఇంటికి చేరుకుంటుంది. ఆమె సూచన మేరకు శివాజీ నటన మీద దృష్టి పెట్టి ప్రశంసలు అందుకుంటుంటాడు. ఉన్నట్టుండి శారద మంచానపడుతుంది. ఆమె చికిత్స కోసం రూ.లక్ష సంపాదించడానికి శివాజీ నిజ జీవితంలో మరో వ్యక్తిగా నటించి జైలు పాలవుతాడు. తిరిగి వచ్చేసరికి అతని భార్య చనిపోయిందని, పుట్టిన పాప అనాథ ఆశ్రమానికి చేరుకుందని తెలుస్తుంది. అప్పటి నుంచి ఆ పాప కోసం గాలిస్తుంటాడు. తన బిడ్డలాంటి అనాథ పిల్లల కోసం శారదా సదన్ ను నిర్వహిస్తుంటాడు. తప్పిపోయిన పిల్లలను కాపాడి వాళ్ల తల్లిదండ్రులకు అప్పగిస్తుంటాడు. సదన్ నిర్వహణ కోసం మారు వేషాలు వేస్తూ జైలుకు వెళ్తుంటాడు. ఆ క్రమంలోనే అతనికి గాయత్రీ పటేల్ (మోహన్బాబు) పరిచయమవుతాడు. శివాజీ, గాయత్రీపటేల్ చూడ్డానికి ఒకటే రకంగా ఉంటారు. దాంతో వారిద్దరి మధ్య ఓ ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందంలో శివాజీ మోసపోతాడు. అయితే దీనికి ప్రధాన కారణం శివాజీ కుమార్తె అవుతుంది. ఇంతకీ ఆమె ఎందుకు కారణమైంది? మధ్యలో శ్రేష్ఠ ఎవరు? ఆమె వల్ల శివాజీకి జరిగిన మంచి ఏంటి? చెడు ఏంటి? శేఖర్ని, శివాజీ స్నేహితుడు ప్రసాద్ని గాయత్రి పటేల్ ఎందుకు చంపించాడు వంటివన్నీ ఆసక్తికరం.
నటీనటులు : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. యాక్టింగ్ విషయంలో సూపర్బ్ అనిపించినా.. డ్యాన్స్ లు, ఫైట్స్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డారు. (హెచ్ఏంటీవీ రివ్యూస్) చిన్న పాత్రే అయిన విష్ణు కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విష్ణు నటించిన ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ తో కంటతడి పెట్టిస్తాయి. శ్రియ అందంగా, హుందాగా కనిపించింది. కీలకమైన గాయత్రి పాత్రలో నిఖిలా విమల్ మంచి నటన కనబరించింది. జర్నలిస్ట్ పాత్రలో అనసూయ పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. ఇతర పాత్రల్లో శివ ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, రాజా రవీంద్ర, బ్రహ్మానందం తమ పరిధి మేరకు మెప్పించారు.
విశ్లేషణ : ఇప్పటి వరకు క్లాస్, హార్ట్ టచింగ్ సినిమాలు మాత్రమే చేసిన మదన్ తొలిసారిగా ఓ థ్రిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోహన్ బాబు లాంటి విలక్షణ నటుడికి తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. చాలా కాలం తరువాత మోహన్ బాబు ను పూర్తి నెగెటివ్ క్యారెక్టర్ లో చూపించిన మదన్ అభిమానులు మెప్పించాడు. ఫస్ట్ హాఫ్లో వేగంగా కథ నడిపించిన దర్శకుడు. ద్వితీయార్థంలో మాత్రం కాస్త స్లో అయ్యాడు. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నా కథనం నెమ్మదించటం, (హెచ్ఏంటీవీ రివ్యూస్) అవసరం లేకపోయినా ఇరికించిన ఐటమ్ సాంగ్లు కాస్త ఇబ్బంది పెడతాయి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ డైమండ్ రత్నబాబు డైలాగ్స్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివాజీ పాత్రతో పలికించిన డైలాగ్స్కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. నటనలో సూపర్బ అనిపించిన కలెక్షన్ కింగ్ డ్యాన్స్ ల విషయంలో మాత్రం నిరాశపరిచాడు. తమన్ సంగీతమందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు
- మోహన్బాబు నటన
- విష్ణు, శ్రియ నటన
- కుర్చీ, మార్కెట్, క్లైమాక్స్ ఫైట్లు
- డైలాగులు
- సెకండాఫ్లో విష్ణు, శ్రియ మధ్య వచ్చే సన్నివేశాలు
మైనస్ పాయింట్లు
- కామెడీ పెద్దగా లేదు
- ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది
- చాలా సన్నివేశాల్లో కొత్తదనం కనిపించదు
రేటింగ్: 2.75/5