రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర మొదలైంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివ దేహం బయటకు తీసుకువచ్చారు. కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు పాడె ముందు నడుస్తుండగా... ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. పాడెకు ముందు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఉన్నారు. అనంతరం భౌతకకాయాన్ని అంతిమయాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలోకి చేర్చారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్పేట్నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.