చార్ ధామ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు ఉత్తరాఖండ్ లో పడుతున్న మంచు వర్షంలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి యాత్రకు వెళ్లిన 104మంది యాత్రికులు.. బద్రీనాథ్ వద్ద మంచు వర్షంలో చిక్కుకున్నారు. వీరంతా ఏప్రిల్ 26న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి చార్ధామ్ యాత్రకు బయల్దేరారు. బాధిత యాత్రికులంతా 55 ఏళ్లకు పైబడినవారే. వీరిలో 38 మంది యాత్రికులు.. సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని తెలుస్తోంది.
చార్ ధామ్ యాత్రకు వెళ్లిన 104మంది తెలుగు యాత్రికుల్లో 66మంది.. బద్రీనాథ్లోని ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. కనీసం భోజనం కూడా లభించక వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల్లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి కూడా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఏపీ భవన్ అదనపు కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంచువర్షంలో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
బద్రీనాథ్ ప్రాంతంలో ఇంకా మంచు వర్షం కురిసే అవకాశం ఉండటంతో.. మరో మూడ్రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న స్థానిక అధికారులు చెబుతున్నారు. తాము మూడ్రోజులపాటు అక్కడే ఉండాల్సి వస్తుందని తెలిసిన యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. బాధిత యాత్రికులంతా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.