నటి జ్యోతికపై హిందూ మక్కళ్ కట్చి నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాచియార్. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ఇంతకు ముందే తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పలు సంఘాల వ్యతిరేకతతో ఆ సన్నివేశాల్లోని సంభాషణలను చిత్ర వర్గాలు బీప్ చేశారు. ఈ నేపథ్యంలో నాచియార్ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదల అయింది.
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ చిత్రంలో సంభాషణలు ఉన్నాయంటూ ఆ సంస్థ సభ్యుడు కాళికుమార్ శుక్రవారం చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా జ్యోతిక చెప్పే డైలాగ్ను తొలగించాలని, దీనివల్ల మతపరమైన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ... ఇందుకు బాధ్యులైన దర్శకుడు బాలా, నటి జ్యోతికలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కాగా, ఈ చిత్రంలో నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కూడా నటించారు.