అతిలోకసుందరి మరణించి రెండు వారాలవుతోంది అయినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఆమె స్థానం పదిలంగానే ఉంది. సినిమాల్లోని ఆమె నటనను జనం మరచిపోలేకపోతున్నారు. అయితే శ్రీదేవి గురించి ఎవరికి తెలియని విషయాలతో డాక్యుమెంటరీ తెరకెక్కించాలని బోనీ కపూర్ ప్లాన్ చేస్తున్నారు.
భారత సినిమా చరిత్రలో శ్రీదేవిది ప్రత్యేక స్థానం. పురుషులతో సమానంగా సూపర్స్టార్గా స్టార్డమ్ సంపదించుకున్నారు శ్రీదేవి. శ్రీదేవి మరణించి 15 రోజులవుతున్నాయ్. శ్రీదేవి మృతిని కుటుంబసభ్యులతో పాటు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో ఆమె నటనను గుర్తు చేసుకుంటున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలోనూ నటీనటులు శ్రీదేవికి నివాళులు అర్పించారు.
4 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన శ్రీదేవి దాదాపు 50 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు. 260 సినిమాల్లో నటించి తనకు ఎవరు సాటిలేరని నిరూపించారు శ్రీదేవి. ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీకపూర్ అతిలోక సుందరి గురించి ఎవరికి తెలియని విషయాలతో డాక్యుమెంటరీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డాక్యుమెంటరీలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎవరు ఊహించని విషయాలు చూపించనున్నట్లు తెలుస్తోంది.
రూప్ కీ రాణి డాక్యుమెంటరీకి మిస్టర్ ఇండియా దర్శకుడు శేఖర్ కపూర్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంటరీలో శ్రీదేవితో సినిమాలు తీసిన దర్శకులు, నిర్మాతలు, కలిసి నటించిన హీరోల అభిప్రాయాలు ఉంటాయని తెలుస్తోంది. శ్రీదేవి డాక్యుమెంటరీ గురించి ఎప్పుడు ప్రకటిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.