కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో సల్మాన్ఖాన్ను దోషిగా తేల్చిన రాజస్తాన్లోని జోథ్పూర్ కోర్టు...ఐదేళ్ళ కారాగార శిక్షతో పాటు 10 వేల జరిమానా కూడా విధించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గరిష్ఠంగా ఆరేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉండగా, న్యామమూర్తి ఐదేళ్ల జైలు శిక్షను విధించారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో ఇతర నిందితులు సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్ను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.
కృష్ణజింకలను వేటాడిన కేసులో దాదాపు 20 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 1998 అక్టోబర్లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ జోథ్పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలపై కాల్పులు జరిపారు. కృష్ణజింకలను వేటాడిన సమయంలో సమయంలో సల్మాన్తో పాటు నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలమ్, టబు కూడా ఉన్నారు. సల్మాన్ ఖాన్పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేయగా ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. 20 ఇరవై ఏళ్ల పాటు విచారణ కొనసాగగా గత మార్చి 28నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ తీర్పు వచ్చింది.
కృష్ణజింకలు, దుప్పిలను వేటాడినట్లు సల్మాన్పై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో సల్మాన్కు ఇప్పటికే కిందికోర్టు శిక్ష విధించగా రాజస్థాన్ హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ప్రస్తుతం రెండు కృష్ణజింకలను చంపిన కేసులోనే సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఉన్నత న్యాయస్థానంలో ఈ తీర్పును సవాలు చేసే అవకాశం సల్మాన్కు కల్పించారు. కోర్టు తీర్పు వినగానే సల్మాన్ సోదరి కోర్టులోనే కన్నీరుమున్నీరైంది. న్యాయమూర్తి తీర్పు చెప్పగానే సల్మాన్ఖాన్ను జోధ్ పూర్ కోర్టు నుంచి ...జోధ్పూర్ సెంట్రల్ జైల్కు తరలించారు.
జైల్లో పెట్టడానికి ముందు సల్మాన్కు వైద్యపరీక్షలు చేయించాల్సి ఉండడంతో జోధ్ పూర్ జైలులోనే అందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య పరీక్షల తర్వాత సల్మాన్ను బ్యారక్కు తరలిస్తారు. సల్మాన్ను లైంగిక వేధింపుల కేసులో శిక్ష అనుభవిస్తున్న దొంగబాబా ఆశారామ్ బాపు బ్యారక్లో ఉంచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తనకు పడిన ఐదేళ్ళ జైలు శిక్షపై హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. జోధ్ పూర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై బెయిల్ కావాలంటూ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై రేపు ఉదయం పదిన్నరకు విచారణకు రాబోతోంది.