గ్వాటెమాలా అగ్నిపర్వత విస్ఫోటన మృతుల సంఖ్య మంగళవారం నాటికి 69కి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని, సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు చెప్పారు. అగ్నిపర్వత విస్ఫోటనంతో పూర్తిగా ధ్వంసమైన ఎల్ రోడియో గ్రామ పరిసర ప్రాంతాలలో బూడిద కుప్పల నుండి మరిన్ని మృతదేహాలు వెలుగు చూడటంతో మృతుల సంఖ్య పెరిగిందని గ్వాటెమాలా జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ కాన్రెడ్ చెబుతోంది. బూడిద కుప్పల నుండి వెలువడుతున్న మృతదేహాలు గుర్తించేందుకు వీలు లేకుండా వున్నాయని, కొంతమందిని లావా శిధిలాలలో పడిన వేలి ముద్రల ఆధారంగా గుర్తించామని, అధికశాతం మందిని గుర్తించటం కష్టసాధ్యంగా వుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోరెన్సిక్ సైన్సెస్ డైరెక్టర్ ఫాన్యుయెల్ గార్షియా వివరించారు. ఇంత ఘోర విపత్తులోనూ ఆశ్చర్యం ! పూర్తిగా బూడిదతో నిండిపోయిన ఓ ఇంటినుంచి సజీవంగా ఓ చిన్నారిని పోలీసు అధికారి చాకచాక్యంగా రక్షించాడు.
ముద్దులొలుకుతున్న ఆ పాపను సురక్షితంగా ఆయన బయటకు తీసుకువచ్చాడు. ఎల్ రోడియో గ్రామంలో కనబడిందీ దృశ్యం. 700 డిగ్రీల సెంటిగ్రేడ్ తో వేడెక్కిపోయిన లావా ప్రవాహం ఇంకా పెరుగుతూనే ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని అధికారులు భయపడుతున్నారు. సుమారు 4 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా సోమవారం గ్వాటెమాలాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2 గా నమోదైంది.